ఈ క్రతువులు సిగ్గుచేటు
రాజకీయాలలో మత పరమైన జోక్యం ఉండకూడదు, అటువంటిది దేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభ సమయంలో మతపరమైన క్రతువులు నిర్వహించడం లౌకికవాదాన్ని పరిహసించడమే అవుతుంది. యజ్ఞ యాగాలు, మతపరమైన ప్రార్థనలు చేయడం అంటే దేశాన్ని మరల రాచరిక ఫాసిస్టు సమాజంవైపు మళ్లించడమే అవుతుంది. రాకెట్ ప్రయోగానికి ముందు పూజలు చేయడం, రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు జడ్జి, ప్రధాని, ముఖ్యమంత్రి వంటి వాళ్ళందరూ మత భక్తి విశ్వాసాలతో ఉంటూ ప్రభుత్వ పాలనలో సొంత అజెండా అయిన మతాన్ని, మత విశ్వాసాలను సమాజం పై రుద్దుతున్నారు. దేశ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన పరిపాలనలో మత పరమైన జోక్యం లేకుండా హేతుబద్దంగా శాస్త్రీయ దృక్పథంతో పాలన సాగించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ఏ(హెచ్) ప్రకారం ప్రజల్లో, సమాజంలో శాస్త్రీయ దృక్పథం కల్పించే బాధ్యత పాలకులపై ఉంది. అటువంటిది దేశ ప్రధాని తన స్వంత అజెండాతో ముందుకు వెళ్లడం రాజ్యంగ విరుద్ధం. ఇదేక్రమంలో నూతన పార్లమెంట్ భవనంలో దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న త్యాగధనుల చిత్ర పటాలను నెలకొల్పాలి. పార్లమెంటు భవనం ప్రారంభంలో మతపరమైన ప్రార్థనలు, యజ్ఞాలు చేయడంపై పనఃపరిశీలన జరపాలని ఆకాంక్షిస్తున్నాను.
మోతుకూరి అరుణకుమార్, విజయవాడ
The post ఈ క్రతువులు సిగ్గుచేటు appeared first on విశాలాంధ్ర.